CHANDRABAU : మళ్లీ అమరావతి పనులను పరుగులు పెట్టిస్తా - మంత్రులపై చంద్రబాబు ఫైర్

Chandrababu Latest News: టీడీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకొచ్చారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఐ - టీడీపీ అభినందన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంతో పాటు మంత్రులను టార్గెట్ చేశారు.

ఉదయం లేచింది మొదలు నన్ను తిట్టడమే మంత్రులకు పెద్ద పని అన్నారు చంద్రబాబు. మంత్రులకు సాక్షి నుంచి ఓ నోట్ వస్తుందని.. ఆ నోట్ లో ఉన్నది ఉన్నట్టుగా చదివేస్తారని విమర్శించారు. అక్రమ మైనింగ్ చేసేవ్యక్తి మైనింగ్ మంత్రి అని... సొంతూళ్లో పిల్ల కాల్వ తవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా, నియోజకవర్గంలో 10 ఇళ్లు కట్టలేని వ్యక్తి హౌసింగ్ మంత్రిగా ఉన్నారని దుయ్యబట్టారు."పెట్టుబడులు గురించి అడిగితే కోడిగుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల మంత్రి. జగన్ కు కోర్టుల్లో అనూకుల తీర్పులు రావాలని హిందూ దేవాలయాల సొమ్ముతో యాగాలు చేసేవ్యక్తి దేవదాయ శాఖ మంత్రి. రైతు బజార్లను తాకట్టు పెట్టేవ్యక్తి ఆర్థిక శాఖ మంత్రి" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

పార్టీకి కార్యకర్తలే ముఖ్యం, ప్రజలకు పార్టీకి వారధిగా పనిచేసేది కార్యకర్తలే అని చెప్పారు చంద్రబాబు. మహానాడులో ప్రకటించిన టీడీపీ మినీ మ్యానిఫెస్టో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి చేరింది, మన మ్యానిఫెస్టోపై ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఇస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది విద్యార్దులుంటే అందరికీ ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పాకొచ్చారు. "వైసీపీ పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. జాబు రావాలంటే బాబు రావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీదే. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచటం తెలిసిన పార్టీ టీడీపీ.టీడీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం. ఐటీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలి. నిన్న నంబూరులో హజ్ యాత్రకు వెళ్లే వారికి కలవడానికి ముందుగా నేను షెడ్యూల్ ఇస్తే ..నాకు అనుమతివ్వకుండా అదే షెడ్యూల్ కి సీఎం వెళ్లారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి? అధికారం ఉందని ఇస్టారుసారంగా వ్యవరించటం సిగ్గుచేటు. హజ్ హౌస్ కట్టలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట, టీడీపీ అధికారంలోకి రాగానే విజయవాడలో దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ హౌస్ నిర్మిస్తాం. శంకుస్ధాపనలు చేసిన వాటికి మళ్లీ శంకుస్ధాపనలు చేయటం తప్ప ఈ ముఖ్యమంత్రి ఒక్క పని అయినా పూర్తి చేశారా? బోగాపురం విమానాశ్రయం, మచిలిపీట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ కి రెండో సారి శంకుస్దాపనలు చేశారు, తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు.

అమరావతి ఎక్కడికి వెళ్లదు...

హైదారాబాద్ కి దీటుగా అమరావతి నిర్మించాలని సంకల్పించామని చెప్పారు చంద్రబాబు. కానీ జగన్ మూడు ముక్కలాటతో ప్రజల భవిష్యత్ తో ఆటలాడుతున్నారని ఫైర్ అయ్యారు. "అమరావతి ఎక్కడికి వెళ్లదు, టీడీపీ అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తాం. జగన్ కి ఇచ్చిన టైం అయిపోయింది, వైసీపీ పాలనకు ఎక్స్ పైర్ డేట్ దగ్గర పడింది. వచ్చే ఎన్నికలు దోపిడి దారులకు పేదలకు మద్య జరుగుతున్న యుద్దం, దోపిడి దారులు దోచుకున్న డబ్బంతా పేదలకు పంచుతాం. కౌరవ సభను గౌరవ సభగా చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వచ్చే కురుక్షేత్రం లో కౌరవ వధ జరగాలి" అని చంద్రబాబు కామెంట్స్ చేశారు.

2023-06-09T14:14:34Z dg43tfdfdgfd